Champions Trophy 2025: విరాట్‌ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌ | Champions Trophy 2025: India Beat Australia By 4 Wickets In First Semi Final, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

CT 2025 IND Vs AUS: విరాట్‌ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

Mar 4 2025 10:12 PM | Updated on Mar 5 2025 9:15 AM

Champions Trophy 2025: India Beat Australia By 4 Wickets In First Semi Final

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఎడిషన్‌ భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్‌ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.

స్టీవ్‌ స్మిత్‌ (73), అలెక్స్‌ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్‌ ఆటగాళ్లలో ట్రవిస్‌ హెడ్‌ 39, కూపర్‌ కన్నోలీ 0, లబూషేన్‌ 29, జోస్‌ ఇంగ్లిస్‌ 11, మ్యాక్స్‌వెల్‌ 7, డ్వార్షుయిస్‌ 19, ఆడమ్‌ జంపా 7, నాథన్‌ ఇల్లిస్‌ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ చెరో​ వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకే ఒక స్పెషలిస్ట్‌ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్‌ చేయడంలో సఫలమైంది.

ఛేదనలో విరాట్‌ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్‌ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది కేఎల్‌ రాహుల్‌ (42 నాటౌట్‌) మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. ఆఖర్లో హార్దిక్‌ (24 బంతుల్లో​ 28) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. భారత్‌ గెలుపులో శ్రేయస్‌ అయ్యర్‌ (45), అక్షర్‌ పటేల్‌ (27) తలో చేయి వేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. 

భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (8) ఒక్కడే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో ఇల్లిస్‌, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్‌, కన్నోలీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆసీస్‌ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్‌ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.

కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ లాహోర్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్‌ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement