బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్‌ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు | Jasprit Bumrah Champions Trophy 2025 Fate May Be Decided Today, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్‌ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు

Feb 11 2025 8:57 AM | Updated on Feb 11 2025 9:44 AM

Bumrah Champions Trophy Fate May Be Decided Today

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో (Champions Trophy) భారత స్టార్‌ పేసర్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Burah) ఆడతాడా లేదా అనేది నేడు తేలిపోతుంది. అతని ఫిట్‌నెస్‌ నివేదికను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో  ఇటీవలే స్కానింగ్‌ జరిగింది. దీనిపై డాక్టర్లు ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. 

జనవరిలో ఆ్రస్టేలియాతో సిడ్నీతో జరిగిన చివరి టెస్టు తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్‌లోనూ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయనే లేదు. అతను కనీసం ఐదు వారాల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే చివరి వన్డేలో (బుధవారం) ఆడి అతను తన ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటాడని భావించారు. 

అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే బుమ్రా ఈ మ్యాచ్‌ కూడా ఆడటం సందేహమే. చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు 11వ తేదీ వరకు అవకాశం ఉంది. బుమ్రా సిద్దంగా లేకపోతే ఢిల్లీ పేసర్‌ హర్షిత్‌ రాణాకు (Harshit Rana) టీమ్‌లో స్థానం లభించవచ్చు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణా తొలి రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు.    

Advertisement
 
Advertisement
Advertisement