స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న (మే 3) జరిగిన ఫైనల్లో కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కింగ్స్మెన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, విజేతగా అవతరించింది. 2017 తర్వాత పెషావర్ గెలిచిన తొలి పీఎస్ఎల్ టైటిల్ ఇది. అలాగే కెప్టెన్గా బాబర్ ఆజమ్కు ఇది తొలి పీఎస్ఎల్ టైటిల్. పీఎస్ఎల్ ట్రోఫీని బాబర్ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకున్నాడు.
లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పెషావర్, కింగ్స్మెన్ను 18 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూల్చంది. సైమ్ అయూబ్ (54) ఒంటరిపోరాటం చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పెషావర్ మీడియం పేసర్ ఆరోన్ హార్డీ 4 వికెట్లు తీసి కింగ్స్మెన్ను దారుణంగా దెబ్బకొట్టాడు. నహిద్ రాణా (4-1-22-2) అతనికి సహకరించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పెషావర్ సైతం తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరోన్ హార్డీ బ్యాట్తోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. అజేయమైన అర్ద సెంచరీ (56) చేసి పెషావర్ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి అబ్దుల్ సమద్ (48) సహకరించాడు. కింగ్స్మెన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 3 వికెట్లు తీసి పెషావర్ను ఇబ్బంది పెట్టాడు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్తో సత్తా చాటిన హార్డీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కాగా, పెషావర్ టైటిల్ సాధించడంతో బాబర్ ఆజమ్ కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగానూ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్కు ముందు పేలవ ఫామ్లో ఉండిన అతను.. సీజన్ పూర్తయ్యే సరికి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి తన జట్టు ప్రతి విజయంలో కీలక పాత పోషించాడు. ఈ సీజన్లో బాబర్ 11 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 588 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ చరిత్రలో ఓ ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం ఇదే మొదటిసారి.


