Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్‌

Ashes: Usman Khawaja Smashes Century Comeback Wife Joins Celebration Viral - Sakshi

Ashes Series 2021-22 Aus Vs Eng: సుమారు రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ముందుగా చెప్పినట్లుగానే సెంచరీ సాధించి సత్తా చాటాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రవిస్‌ హెడ్‌ నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో హెడ్‌​ ఐసోలేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో ఖవాజాకు తుది జట్టులో చోటు దక్కింది.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిడ్నీ టెస్టుతో రీ ఎంట్రీ ఇచ్చిన అతడు 260 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 137 పరుగులు సాధించాడు. స్టీవ్‌ స్మిత్‌(67 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమైన వేళ ఖవాజా తన విలువేంటో చాటుకున్నాడు. శతకం పూర్తి చేసుకోగానే భావోద్వేగానికి లోనైన ప్రేక్షకుల వైపు చూస్తూ తనదైన స్టైల్లో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న అతడి భార్య రేచెల్‌ సైతం ఉద్వేగానికి లోనైంది. 

తమ కుమార్తెను ఎత్తుకుని తండ్రి వైపు చూపిస్తూ భర్త ఉద్వేగక్షణాలను తానూ ఆస్వాదించింది. ఇక ఆట విషయానికొస్తే ఖవాజా సెంచరీ, స్మిత్‌ హాఫ్‌ సెంచరీతో 418 పరుగుల వద్ద ఎనిమిది వికెట్ల నష్టానికి ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా ప్రస్తుతం ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కొనసాగుతోంది. కాగా ఆసీస్‌ ఇప్పటికే 3-0 తేడాతో యాషెస్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top