సిద్దిపేటరూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అన్ని రాజకీయ బూత్ లేవల్ ఏజెంట్లు చురుగ్గా పాల్గొని బోగస్ ఓటరు నమోదు కాకుండా చూడాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి మంగళవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ జాబితా సమగ్ర పునఃపరిశీలన కోసం ఈనెల 25వ తేదీ నుంచి ఎన్యూమారేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికే నియమించిన బిఎల్ఏలు ఈ ప్రక్రియలో పాల్గొని చురుగ్గా వ్యవహరించాలన్నారు. ఎస్ఐఆర్ పై అపోహ పెట్టుకోవద్దని ఒక ఓటరుకు ఒకే చోట ఓటరుగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవలం చనిపోయిన వారివి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారినీ తొలగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డీవో సదానందం, సిద్దిపేట అర్బన్ తహసీల్దార్, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.


