ఏడుపాయల ఆలయం
● పదవుల పందేరానికి మొదలైన కసరత్తు
● జూలైలో భర్తీకి చర్యలు
● పెద్దాయన గ్రీన్ సిగ్నల్!
పాపన్నపేట(మెదక్): పెద్దాయన గ్రీన్ సిగ్నల్తో పాపన్నపేటలో నామినేటెడ్ పదవుల పందేరం మొదలయ్యింది. ఈ మేరకు నాయకులు ఆదివారం మండల పరిఽధిలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఊరికో పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల, పాపన్నపేట ఏఎంసీ, మెదక్ డివిజన్ ఆత్మ కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీకి కేటాయించడంతో అర్కెలకు చెందిన చిట్యాల వినోద పేరు దాదాపు ఖరారు అయ్యింది. ఇక ఏడుపాయల చైర్మన్ పదవికి ఆరుగురి మధ్య పోటీ నెలకొంది. ఇక ఆత్మ కమిటీలో పాపన్నపేట మండలంలోని ఆరుగురు ఆశావహులకు పదవి లభించే అవకాశముంది. జూలైలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
40 గ్రామాలు.. 30 పోస్టులు
ఏడుపాయల పాలకమండలిలో 15 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ అఫీషియోతో పాటు కొల్చారం మండలానికి రెండు, మెదక్ మండలానికి రెండు డైరక్టర్ పోస్టులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలేవి చైర్మన్తో కలుపుకొని 10 డైరెక్టర్ పోస్టులు, మార్కెట్ కమిటీలో 18 డైరక్టర్ పోస్టులుండగా, నలుగురు నామినేటెడ్ పోను 14 మందిని పాలకవర్గంలోకి తీసుకోవచ్చు. ఇక మెదక్ ఆత్మ కమిటీలో 25 మంది సభ్యులుండగా, పాపన్నపేట మండలానికి 6 పోస్టులు వచ్చే అవకాశం ఉంది.
రేసులో ఆరుగురు
ఏడుపాయల చైర్మన్ పదవిని ఆరుగురు నాయకులు ఆశిస్తున్నారు. కొత్తపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ లింగన్న గారి మల్లప్ప, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గోవింద్ నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, కొడుపాక మాజీ సర్పంచ్ భూమన్న రేసులో ఉన్నారు. యూత్ కాంగ్రెస్ విభాగం నుంచి కుర్తివాడ మాజీ ఎంపీటీసీ రాము చైర్మన్ అవకాశం ఇవ్వాలని కోరారు.


