బడిని చూడాలిక.. సమస్యలు తీర్చాలిక
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. విద్యార్థి దశలో పాఠశాల విద్య ఎంతో ప్రధానం. బడి బాగుంటేనే విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహపడుతుంది. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రేకుల గదులలో తరగతులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పాలకులు స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
రేకుల గదిలోనే తర‘గతి’
మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్రావు స్వగ్రామం బొప్పాపూర్లో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. అందులో 1 నుంచి 7వ తరగతి వరకు విద్యను అందిస్తుండగా మొత్తంగా 49 మంది విద్యార్థులున్నారు. సరిపడా తరగతి గదులున్నప్పటికీ మూడో తరగతి రేకుల గదిలో కొనసాగుతోంది. దీంతో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో విద్యార్థులు వేడితో ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్షం కూరిస్తే రేకులపై పడటంతో శబ్ధం వస్తుంటే క్లాస్ వినడం ఇబ్బందిగా మారుతోంది. అలాగే ఈ పాఠశాలలలో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. విద్యార్థులకు చల్లటి తాగునీటిని తాగేందుకు వాటర్ కూలర్ను అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే 49 మంది విద్యార్థులకు రెండు మూత్రశాలలే ఉన్నాయి.
టీచర్ల కొరత...
మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. 196 మంది విద్యార్థులుండగా బాలురు 94, బాలికలు 102 మంది ఉన్నారు. ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు కొరత ఉంది. అలాగే ఫర్నిచర్ సమస్య ఉంది. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం లేదు. కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత విజ్ఞానం అందించాల్సిన అవసరం ఉంది.


