● ఆలస్యంతో విద్యార్థినికి నో ఎంట్రీ ● పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎన్టీఏ అధికారి ● 939 అభ్యర్థులకు 812 మంది హాజరు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. గత మే నెల 3న నీట్ పరీక్షలు జరుగగా పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు చేశారు. తిరిగి ఆదివారం పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15గంటల వరకు పరీక్ష జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. 939 మంది అభ్యర్థులకు 812 మంది హాజరయ్యారు. 127 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్, ఎన్టీఏ నోడల్ అధికారి సూర్యప్రకాశ్, తదితర అధికారులు పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణను, సీసీ కెమెరాల కంట్రోల్ రూంను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో నీట్ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామన్నారు. అయితే నిర్ణీత సమయానికి ఆలస్యంగా ఒక విద్యార్థిని రావడంతో, సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని వెనుతిరిగారు.


