నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): శ్వాసపై ధ్యాస పెట్టడం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో ప్రజలకు తెలిసివచ్చింది. పనిలో ఒత్తిడులు, ఇంట్లో చిరాకులు, ప్రయాణంలో అలసట, పనిలో మనసు లగ్నం చేయకపోవడం, చదువులో అనాసక్తి, చదివింది గుర్తుకు లేకపోవడం ఇవన్నీ నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎదుర్కొంటున్న సవాళ్లు. జిల్లాలోని పట్టణాల్లో, గ్రామాల్లోని పాఠశాలల్లో యోగాను విద్యార్థులకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు.
ఈ యోగాసనాలతో...
ఇందులో ముఖ్యంగా ఉద్యోగులు, గృహిణిలు, విద్యార్థులు, ఇతర ప్రజలు ప్రతీ దినం వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం, బస్థ్రిక, సుదర్శన క్రియ, త్రికోణాసన, సూర్యభేధప్రాణాయామం, పద్మాసన, గోముఖాసన, భ్రమరి ప్రాణాయామం, అర్థమత్స్యేంద్రాసన, నౌకాసన, హలాసన, భుజంగాసన, సేతుబంధాసనం, పవనముక్తసనం, త్రాటకక్రియ, పార్శ్వకోనాసన, బద్దపద్మాసన, వృక్షాసనం, పర్వాతాసనం, భూమాసనం, తాడాసనం, ఉష్ట్రాసనం, గండభేరుండాసనం లాంటి యోగాసనాలు చేస్తున్నారు. యోగాను క్రీడగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు యోగాలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. జిల్లాకు చెందిన అనేకమంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి యోగా పోటీల్లో రాణిస్తున్నారు. నేడు జిల్లా కేంద్రంలోని మినీ క్రికెట్ స్టేడియంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
మానసిక ప్రశాంతత
యోగా అనేది ప్రతీ ఒకరికి ఉపయోగపడుతుంది. నేను గత 15ఏళ్లుగా యోగా చేస్తు, ఇతరులకు శిక్షణ ఇస్తు్ాన్నను. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో విద్యార్థులకు పాఠాలు బోధించి వచ్చేటప్పటికి చాలా అలసిపోతాను. అందుకు ప్రతీ రోజు గంట నుంచి రెండు గంటల వరకు యోగా చేస్తాను. దీంతో నాకు మానసిక ప్రశాంతతోపాటు, శారీరకవిశ్రాంతిని పొందుతున్నాను.
– బస్వరాజ్కుమార్, ఉపాధ్యాయుడు, యోగా శిక్షకుడు సిద్దిపేట
డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు
ప్రతీ ఒకరు యోగా చేస్తే డిప్రెషన్ నుంచి సులువుగా బయటపడవచ్చు. మానసిక, శారీరక అలసటల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్, తదితర వ్యాధులున్నవారు యోగా చేయడంతో అనేక ఉపయోగాలు ఉంటాయి. జిల్లాలో అనేకమంది యోగాను ప్రతి రోజు చేస్తున్నారు.
– సతీశ్ ఉపాధ్యాయుడు, యోగా శిక్షకుడు, సిద్దిపేట
పని ఒత్తిడి, ఇతర సమస్యలతో అనేకమంది నిరంతరం తమ మనస్సును ప్రశాంతగాఉంచుకోలేకపోతున్నారు. మారుతున్న ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని జయించలేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఒత్తిడిని దీటుగా ఎదుర్కొనేలా మనస్సును అదుపులో పెట్టుకుని మానసిక ప్రశాంతిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగ ఓ దివ్యౌషధం. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేస్తూ చాలామంది మానసిక ప్రశాంతత పొందుతున్నారు. కేవలం వయసు పైబడిన వారు, పని ఒత్తిడి ఉన్న వారు కాకుండా యువత నిత్యం యోగాసనాలు వేస్తున్నారు. దీంతో జిల్లాలో యోగాపై ప్రజల్లో మంచి అవగాహనతోపాటు ఆసక్తి పెరిగింది. నేడు ప్రపంచ యోగా దినోత్సవంసందర్భంగా ‘సాక్షి’అందిస్తున్న ప్రత్యేక కథనం..


