సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గన్నారపు సుదర్శన్ నియామకమయ్యారు. ఈ మేరకు హైకోర్టు శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన సాయిరమాదేవి హైదరాబాద్కు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ సిద్దిపేటకు బదిలీ అయ్యారు.
ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్ హైమావతి తెలిపారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడిన సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీమ్ అదేరోజు జిల్లా అధికారులతో సమీక్ష కార్యక్రమం ఉందన్నారు. దీంతో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
కార్మికులకు
మెరుగైన వైద్య సేవలు
మంత్రి వివేక్
రోడ్డెక్కిన జొన్న రైతులు
రామాయంపేట(మెదక్): జొన్నల కొనుగోలు విషయమై అధికారులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కారు. నిబంధనల పేరిట లారీలను గత ఐదు రోజులుగా ఖాళీ చేయించడం లేదని ఆరోపించారు. ఈమేరకు స్థానిక అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు పట్టణంలోని మెదక్ రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం నుంచి మూడు లారీల్లో జొన్నలు గజ్వేల్, దౌల్తాబాద్ గోదాంలకు తరలించగా, నాణ్యతగా లేవనే సాకుతో అక్కడి గోదాం అధికారులు లారీలను ఖాళీ చేయించడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయమై రైతులకు న్యాయం చేస్తానని డీఏఓ హామీ ఇచ్చారు. రైతుల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ బాల్రాజు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఖేడ్కు అంబేడ్కర్ స్టడీసర్కిల్
ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి
నారాయణఖేడ్: ఖేడ్కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ మంజూరు కానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్కుమార్రెడ్డిలను హైదరాబాద్లో కలిసినట్లు తెలిపారు. ఖేడ్కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఆవశ్యకతను వివరిస్తూ నిధులను మంజూరు చేయాలని కోరగా మంత్రి లక్ష్మణ్ సానుకూలంగా స్పందిచినట్లు వివరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
హవేళిఘణాపూర్(మెదక్): మండలంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న నాన్టీచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ గీత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, నైట్ వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్ల ఎంపిక కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు గల మహిళలు చిన్నశంకరంపేటలో కొనసాగుతున్న కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


