ప్రశాంత్నగర్(సిద్దిపేట): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షకు 937 మంది అభ్యర్థులకు గాను 916 మంది హాజరయ్యారు. 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్, నీట్ పరీక్షల నోడల్ అధికారి పరిశీలించారు. ముందస్తు ప్రణాళికతో నీట్ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. అధికారుల ముందస్తు సూచనలతో అమ్మాయిలు తమ బంగారు ఆభరణాలను తల్లిదండ్రులకు ఇచ్చారు. గాజులు లేకుండానే పరీక్షకు హాజరయ్యారు. సాధారణ దుస్తులకు అనుమతి లేకపోవడంతో టీషర్ట్, ప్యాంట్లు ధరించాల్సి వచ్చిందని వాపోయారు. కాగా ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. జిల్లా కేంద్రం పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన అమ్మాయి 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు రావడంతో అప్పటికే గేటు మూసివేశారు. సిబ్బంది పరీక్షకు అనుమతించకపోవడంతో నిరాశగా వెను తిరిగింది.
చెవి కమ్మలు, ముక్కు పొడకలను తొలగిస్తున్న తల్లి
21 మంది గైర్హాజరు
క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిబ్బంది
పరీక్ష కేంద్రాలను సందర్శించిన
కలెక్టర్ హైమావతి


