● కలెక్టర్ హైమావతి ● కొనుగోలు కేంద్రాల సందర్శన
సిద్దిపేటఅర్బన్: తాలు తీసిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలలో కొంటామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి, తడ్కపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పాడీ క్లీనర్ పనిచేయడం లేదని, తాలు తీయడం ఇబ్బంది అవుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రిపేర్ చేయించాలని మార్కెటింగ్ డీఎం నాగరాజును ఫోన్లో ఆదేశించారు. పాడీ క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో పరీక్షించాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం తేమశాతం రాగానే తాలు పట్టించాలని, తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో తాలు తీయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ జరిగే ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని కేంద్రాలలో టెంట్, తాగునీరు, తాలు తీసే యంత్రాలు, కాంటాలు, టార్పాలిన్ కవర్లు, సుతిల్ దారాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రెండు పంటలు వరి సాగు చేసే రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోందని, అధునాతన కార్మాగారం అందుబాటులో ఉన్న దృష్ట్యా ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు.


