హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంబాల పూజారులు అమ్మవారి కథను వినిపించారు. పంబాల కళాకారుల డప్పుకు మంత్రి స్టెప్పులేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని దివ్య కల్యాణం కనులపండువగా సాగింది. కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొత్తగా నియమించిన జాతర ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కిషన్ రావు, కౌన్సిలర్లు, గౌడ కులస్తులు, భక్తులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం


