● పదో తరగతిలో 401 మంది ఫెయిల్ ● అధికంగా గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లోనే..
సాక్షి, సిద్దిపేట: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలోకి ప్రవేశం ఉంటుంది. అయితే పదో తరగతిలో పలువురు విద్యార్థులు తడబడుతున్నారు. తాజాగా వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో 401మంది ఫెయిల్ అయ్యారు. పాఠ్యాంశాల వారీగా పరిశీలిస్తే గణితం, ఇంగ్లిష్లలో అధికంగా ఫెయిల్ అయ్యారు. గణితం పాఠ్యాంశాల్లో సమస్యలను అన్వయించి పరిష్కరించడంలో విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఆంగ్లం స్పష్టంగా చదవడం రాయడం రాకపోవడంతోనే ఫెయిల్ అయ్యారు.
మూడు మండలాల్లో..
దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లోనే అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు. ధూల్మిట్ట, కోహెడ, కుకునూరుపల్లి మండలాల్లో 100శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత శాతం పెరుగుతూ.. తగ్గుతూ
పదేళ్లుగా పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే ఉత్తీర్ణత శాతం పెరుగుతూ... తగ్గుతూ వస్తోంది. 2021–22లో 14,869 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14,550 (97.85 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ ఏడాది రాష్ట్రంలో మొదటి స్థానం జిల్లా సాధించింది. 2018–19, 2022–23. 2023–24లలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది.


