● కలెక్టర్ హైమావతి ● సివిల్ సప్లై, రైస్ మిల్లర్లతో సమావేశం
సిద్దిపేటరూరల్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లు ప్రతినిధులతో, సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12,936 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారి తనూజ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యంతో వచ్చిన లారీలను దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను ఏర్పటు చేసుకోవాలని మిల్లుల యజమానులను ఆదేశించారు. తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు వచ్చేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. అధికారులు, మిల్లర్ల సమన్వయంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పని చేయాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో లారీలను అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు.


