సిద్దిపేటరూరల్: జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26 నుంచి నిర్వహించనున్న స్వీయ గణనలో ప్రజలు పాల్గొనాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. వెబ్ పోర్టల్ https://se.censesgov.in/ సంప్రదించి ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. మే 11 తర్వాత ఇంటికి వచ్చే జనగణన అధికారులకు చూపిస్తే ధృవీకరిస్తారని తెలిపారు. ఇదే విషయమై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్జి, ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందించి, వారి స్వగృహంలో స్వీయ గణన, జియో ట్యాగింగ్ ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేయించాలన్నారు. ఇప్పటికే రెండు గ్రూపులకు శిక్షణ అందించామన్నారు. రోజువారీగా ఇచ్చిన టార్గెట్ ఆధారంగా ఈనెల 30 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి


