● తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించండి ● కలెక్టర్ హైమావతి
నంగునూరు(సిద్దిపేట): అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హైమావతి నిర్వాహకులకు సూచించారు. గురువారం పాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లుకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, బార్దాన్, టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం మాట్లాడుతూ వరి పంట కోయగానే తేమ లేకుండా ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు.
దిగుమతిలో జాప్యం తగదు
చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం దిగుమతిలో జాప్యం రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని పెద్దకోడూరు, గోనెపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు, నిర్వహకులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగ్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తాగు నీరు, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ శాతం రాగానే వెంటనే లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


