● విద్యార్థులకు పోగ్రెస్ కార్డుల పంపిణీ ● జూన్ 12 నుంచి పునఃప్రారంభం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. 2025–26 విద్యాసంవత్సరం గురువారంతో ముగిసింది. జిల్లాలోని 980 ప్రభుత్వ, 250 ప్రైవేట్ పాఠశాలల్లో 1.3లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు గురువారం పాఠశాలల్లో పోగ్రెస్ కార్డులను అందజేశారు. చివరి రోజు విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. 2026–27 నూతన విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని, విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
గురుకులాల విద్యార్థులు ఇంటిబాట..
సెలవుల నేపథ్యంలో గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు తరలి వెళ్లారు. జిల్లాలో 36 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, 59 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.


