చేర్యాల(సిద్దిపేట): అకాల వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తేమ శాతం రాగానే లోడ్ చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం తాడూరు, చిట్యాల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడారు. మిల్లులు కేటాయించలేదని పలువురు రైతులు తెలిపారు. వెంటనే ఏపీఎంకు ఫోన్ చేసి వారం క్రితమే మిల్లుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని, తేమశాతం వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు, ప్యాడీ క్లీనర్లు, తాగునీటి వసతి, అకాల వర్షాలు వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మొత్తం 419 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ మొదలైందని కలెక్టర్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
తేమ శాతం రాగానే
ధాన్యాన్ని లోడ్ చేయండి
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు


