సోలార్ విద్యుత్తో ఇక ఎస్టీపీలు జల్ ిహీ అమృత్ పథకంలో భాగంగా ఏర్పాటు 15 రోజుల్లో అందుబాటులోకి
నర్సాపూర్ ఎస్టీపీ వద్ద
ఏర్పాటు చేస్తున్న
సోలార్ విద్యుత్ ప్లాంట్
మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా విద్యుత్ బిల్లును తగ్గించేందుకు సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. 2022లో రెండు చోట్ల మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లు భారాన్ని తగ్గించేందుకు మున్సిపాలిటీ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.
– సాక్షి, సిద్దిపేట
సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్లో 11 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే), చింతల్ చెరువు వద్ద 7.25 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీలు పని చేస్తున్నాయి. ఈ మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు (ఎస్టీపీ) విద్యుత్పై ఆధారపడి నడుస్తున్నాయి. మోటార్లు, పంపులు నిరంతరం పని చేయాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఫలితంగా ప్రతీ నెల రూ.8లక్షలపై విద్యుత్ బిల్లు భారంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సూర్యశక్తి వైపు అధికారులు అడుగులు వేస్తున్నారు.
జల్ ిహీ అమృత్ స్కీంలో భాగంగా ఎస్టీపీల వద్ద రూ.1.92కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నర్సాపూర్ ఎస్టీపీ వద్ద 245 కిలో వాట్స్, చింతల్ చెరువు వద్ద 42కిలో వాట్స్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యానల్స్ను బిగించారు. గ్రిడ్తో కనెక్షన్ ఇస్తున్నారు. మరో 15 రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకరానున్నారు. ఎస్టీపీలు సోలార్ విద్యుత్తో కొనసాగడం ద్వారా ఒక వైపు విద్యుత్ బిల్లు తగ్గడంతో పాటు గ్రీన్ ఎనర్జీ కానుంది.
ఫోర్ స్టార్ రేటింగ్
ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి అధికారులు సిద్దిపేటలో ఉన్న ఎస్టీపీలను పరిశీలించారు. నర్సాపూర్ ఎస్టీపీకి ఫోర్ స్టార్, చింతల్ చెరువుకు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు ఎస్టీపీలకు మాత్రమే ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వగా అందులో ఒకటి సిద్దిపేటలోని నర్సాపూర్ ఎస్టీపీ వచ్చింది. ప్రతీ రోజు నర్సాపూర్ ఎస్టీపీ ద్వారా 9.5 ఎంఎల్డీ , చింతల్ చెరువు ఎస్టీపీ 6ఎంఎల్డీ నీటిని శుద్దిచేసి అందిస్తోంది. మురుగు నీటిని శుద్ది చేసిన తర్వాత చెరువులు నింపుతున్నారు. అలాగే పట్టణంలో నాటిన మొక్కలకు నీటిని వీటినే అందిస్తున్నారు.
ప్రతీ నెల రూ.8లక్షలు ఆదా
ఎస్టీపీలలో విద్యుత్ బిల్లు ప్రతీ నెల దాదాపు రూ.8లక్షల వరకు వస్తోంది. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లు ఆదా కానుంది. త్వరలో స్థలాలు ఉన్న దగ్గర సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. బుస్సాపూర్ డంప్ యార్డ్ వద్ద సైతం సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
– అశ్రిత్ కుమార్, కమిషనర్,
సిద్దిపేట మున్సిపాలిటీ


