పాఠశాలల్లో పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలో పీఎంశ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేపడుతున్న పలు రకాల పనుల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో పీఎంశ్రీ పథకం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాల్లో ల్యాబ్లు, మరుగుదొడ్లు, భవిత కేంద్రాల పనులు వేగవంతం చేయాలన్నారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 22 కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో చేపట్టిన పనులు సైతం వందశాతం పూర్తి చేయాలన్నారు. అన్ని నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పీఎం కిసాన్, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్లో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో పలు అంశాలపై జూమ్ సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ వారీగా ఏడీఏలు.. క్లస్టర్ వారీగా ఏఓ, ఏఈఓలను మానిటర్ చేస్తూ పూర్తి చేయించాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్ ఫెడ్ అధికారులందరూ సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమీక్షలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూప రాణి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.


