
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి
డీఎంహెచ్ఓ ధనరాజ్
సిద్దిపేటరూరల్: ప్రస్తుతం వానాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు, నారాయణరావుపేట, చింతమడక గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వైద్యులు, సిబ్బంది తప్పకుండా సమయ పాలన పాటించి అంకిత భావంతో సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు బాపురెడ్డి, వినోద్, భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.