
చెప్పింది చేయాలె
రూల్స్ చెప్పొద్దు..
అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అధికార పార్టీ నేతలకు సైతం సమాచారం అందించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య గోడవలు సైతం జరిగిన సంఘటనలున్నాయి. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో రేషన్ కార్డుల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పంపిణీ చేసే కార్యక్రమాల్లో మళ్లీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడ గోడవలకు దిగుతారోనని అధికారుల్లో ఆందోళన నెలకొంది. అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం తలనొప్పిగా మారిందని అధికారులు చర్చించుకుంటున్నట్లు వినికిడి. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ కష్టంగానే ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు ఫిర్యాదులు చేసినంత మాత్రానా మంత్రులు క్షేత్రస్థాయిలో విషయాన్ని తెలుసుకోవాలని పలువురు అధికారులు కోరుతున్నారు.
ఫిర్యాదులు ఇలా..
● జిల్లాలోని ఓ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తాను సూచంచిన వారికే ఇవ్వాలని అధికార పార్టీనేత చెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతలు ఇచ్చిన జాబితాలోని వారికే ఆ మున్సిపాలిటీలో ఇళ్లు కేటాయించారు. దీంతో తాము చెప్పిన పనులు చేయడం లేదని సదరు అధికారిపై ఆగ్రహంతో ఇటీవల ఇన్చార్జి మంత్రి వివేక్కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రికి సదరు అధికారి వివరణ ఇచ్చేందుకు ఇటీవల హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం.
● ములుగు, నంగనూరు, చిన్నకోడూరు మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని అధికార పార్టీ నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ములుగు మండల కేంద్రంలో ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయాలని ఏకంగా కాంగ్రెస్ పార్టీనేత లేఖ సైతం అధికారికి ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ అధికారి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఇన్ వార్డులో ఇవ్వండి అని చెప్పినట్లు తెలిసింది. బదిలీ చేయపోతే ఇన్చార్జి మంత్రి నుంచి ఫోన్ వస్తుందని సదరు అధికారికి హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
పనులు చేయని వారిపైమంత్రులకు ఫిర్యాదులు
అడకత్తెరలో పోకచెక్కలా యంత్రాంగం
ఇక్కడ పని చేయడం ఇబ్బందే
ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంది. అధికార పార్టీ నేతలు వివిధ పనులు మంజూరు కోసం పట్టుబడుతున్నారు. కొన్ని పథకాలను ఎమ్మెల్యేల అనుమతితో చేయాల్సి ఉంటుంది. మరికొన్ని నేరుగా చేయవచ్చు. అధికార పార్టీ నేతలు ఇచ్చినవే చేయాలని పలువురు కోరుతున్నారు. దీంతో ఇక్కడ పని చేయడం చాలా ఇబ్బందే. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడి అధికారులకు తలనొప్పే..
– ఓ జిల్లా అధికారి