
ఫేస్తోనే ఇక పెన్షన్
మరింత పారదర్శకంగా డబ్బు పంపిణీ
పెన్షనర్లకు ఇక నుంచి ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫేస్ రికగ్నిషన్ అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బయోమెట్రిక్ విధానం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడంతో పాటు సులభంగా, వేగంగా పెన్షన్ అందించేందుకు ఈ విధానం చేయనుంది. ఇప్పటికే సంబంధించిన అధికారులు, సిబ్బందికి శిక్షణ అందించారు.
సిద్దిపేటరూరల్: మున్సిపాలిటీల్లో పింఛన్ ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లెతే సదరు లబ్ధిదారునికి అందించే పింఛన్ నిలిచిపోతుంది. కానీ అలా జరగడం లేదు. పింఛన్ దారులు మరణించినా డబ్బులు మాత్రం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. వాటిని కొంతమంది ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అలాగే పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు పింఛన్ కాజేసిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా ప్రభు త్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పకడ్బందీగా అమలు
పెన్షన్ పొందుతున్న వారిలో కొందరు వారి ఆధార్ కార్డుల్లో వయస్సును తప్పుగా నమోదు చేయించుకుంటూ ఎక్కువ వయస్సు ఉందంటూ అధికారులను నమ్మించి మోసం చేస్తూ పెన్షన్లు పొందుతున్నారు. దీంతో ఈ యాప్ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇబ్బందులు దూరం..
ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. పెన్షన్ పొందాలంటే పోస్టాఫిస్కు వెళ్లి అక్కడ బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. ఈ క్రమంలో లబ్ధిదారుల్లో అత్యధికులు వృద్ధులు కావడంతో వేలి ముద్రలు స్కాన్ కాకపోవడంతో వారు పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐరిష్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వార్డు అధికారులు, కార్యదర్శుల బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన యాప్ ద్వారా బయోమెట్రిక్ ఇబ్బందులు దూరం కానున్నాయి. ఆధార్ ఫొటోతో అనుసంధానమైన లబ్ధిదారుల వివరాలు స్మార్ట్ ఫోన్లో ఫొటో తీయగానే చెల్లింపు వివరాలు వస్తాయి. దీంతో వెంటనే పెన్షన్ డబ్బులు పొందేందుకు ఆస్కారం ఉంది.
జిల్లాలో పెన్షన్దారుల వివరాలు
లబ్ధిదారుల సంఖ్య: 1,85,296
నెలవారీగా చెల్లిస్తున్న
డబ్బులు: రూ.40,08,70,736
వృద్ధులు: 58,666
వితంతువులు: 54,734
దివ్యాంగులు: 13,657
ఒంటరి మహిళలు: 3,406
టేకీదార్లు (మునీంలు): 274
చేనేత: 2,194
బీడీ కార్మికులు: 45,393
గీత కార్మికులు: 2,921
ఫైలేరియా: 2,429
డయాలసిస్ రోగులు: 232
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు: 1,390
బయోమెట్రిక్ ఇబ్బందులకు స్వస్తి ఇప్పటికే పూర్తయిన బీపీఎంల శిక్షణ ఆగస్టు నెల నుంచే అమల్లోకి..
అక్రమాలకు చెక్
పెట్టేందుకే..
పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు చెక్పెట్టి మరింత పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశ్యంత ఫేస్ రికగ్నిషన్ యాప్ను తీసుకువచ్చారు. అధికారులకు, బీపీఎంలకు, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ పూర్తి అయింది. పూర్తి స్థాయిలో స్మార్ట్ ఫోన్లను అందించడం జరుగుతుంది. –జయదేవ్ఆర్యా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఫేస్తోనే ఇక పెన్షన్