● విచ్చలవిడిగా యూరియా వాడితే చీడపీడలు ● కృత్రిమ కొరత సృష్టించొద్దు ● అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం ● వ్యవసాయ అధికారులు హెచ్చరిక
హుస్నాబాద్రూరల్: ఈ సీజన్లో పంటలకు కావాల్సిన ఎరువులను ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసేసింది. అయితే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలకు తగిన మోతాదులో ఎరువు వేస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ, భవిష్యత్తులో కొందరు రైతులు యూరియా దొరకదని ముందే కొనుగోలు చేసి నిల్వ ఉంచడం వలన ఏ మాత్రం ప్రయోజనం ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నిల్వ ఉంచడం వలన నత్రజని గాలిలో కలిసి ఎరువు నాణ్యత కోల్పోతుంది. నాణ్యతలేని ఎరువును పంటలకు వేసినా పని చేయదని చెబుతున్నారు. యూరియా కావాల్సిన రైతులకు మిగతా ఎరువులు కొనుగోలు చేస్తేనే ఇస్తామని లింకులు పెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక యూరియాను అవసరానికి మించి రైతులు కొని కృత్రిమ కొరతను సృష్టించే వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.
కొన్ని చోట్ల ఇలా...
సీజన్కు కావాల్సిన 1,13,750 క్వింటాళ్ల యూరియా అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జూలై నెల వరకు కావాల్సిన యూరియా ఇప్పటికే వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నా దుకాణాల్లో మాత్రం దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.
మోతాదు మించితే చీడపీడలు
రైతులు ఎక్కువ మోతాదులో యూరియా వేయడం వలన మొక్క కాండము మెత్తబడి చీడపీడలు చేరి పంటకు నష్టం చేస్తాయని, పంటకాలం పెరిగి నీటి తడుల అవసరం ఎక్కువుతుందని, చీడపీడల నివారణకు అదనంగా పురుగు మందులు వాడటం వలన అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఎకరాకు 2 బస్తాలు, మొక్కజొన్న, పత్తి పంటలకు ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియాను నాలుగు దఫాలుగా వేస్తే మొక్కలకు ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.