
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు రమణాకర్
జగదేవ్పూర్(గజ్వేల్): రాష్ట్రంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్, ఉద్యమ కళాకారులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫోక్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రమణాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కళాకారులకు ఐదు వందల ఇంటి స్థలాన్ని హైదరాబాద్లో ఇవ్వాలని కోరారు. మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద ఓ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన కళాకారుల కార్యనిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృద్ధ కళాకారులకు పింఛన్, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యబీమా అందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ పథకాన్ని పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకపోవడానికి ప్రతి కళాకారుడు కీలకపాత్ర పోషించాలన్నారు. త్వరలో హైదరాబాద్లో సీనియర్ కళాకారులతో కలిసి బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. సభకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్లకు పైగా పనిచేశామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కళాకారుల పాత్ర కీలకమన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి సత్తార్, కోశాధికారి వేణు, ఉపాధ్యక్షుడు నాందేవ్, సలహాదారుడు దరువు అంజన్న, వరంగల్ శ్రీనివాస్, కోదాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.