
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేటరూరల్/సిద్దిపేటఅర్బన్: యోగాను ప్రతీ ఒక్కరు జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. సిద్దిపేట యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగ సొసైటీ, భారత్ స్వాభిమాన ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల గురించి కలెక్టర్తో చర్చించారు. అంతకుముందు సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతూ...రెవెన్యూ అవగాహన సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన ప్రతీ దరఖాస్తును అధికారులు పరిష్కరించాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ యోగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యోగ సాధనకు ఉపయోగపడే క్యాలెండర్ను, హరిద్వార్లోని పతంజలి యోగపీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బొమ్మలతో కూడిన తెలుగు అనువాద పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్, రాష్ట్ర యోగ అధ్యయన పరిషత్ సభ్యులు, ప్రముఖ యోగా శిక్షకుడు తోట సతీశ్, వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్.అరవింద్, అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్రెడ్డి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ పూర్వ సభ్యులు కె. అంజయ్య, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.