
నిర్వహణ లేక కరువైన ఆహ్లాదం
● విరిగిన పరికరాలు, పాడైన సామగ్రి ● పట్టించుకోని అధికారులు
పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులు, ఉద్యానవనాల నిర్వహణ కరువైంది. దుబ్బాకలో పార్కులను అభివృద్ధి చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై కన్నెత్తి చూడకపోవడంతో అధ్వానంగా మారాయి. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆట పరికరాలు, ఇతర సామగ్రి పాడవుతోంది.
దుబ్బాకటౌన్: పట్టణ కేంద్రంలో ప్రజలు సేద తీరేందుకు రామసముద్రం చెరువుకట్ట మీద చిల్డ్రన్ పార్క్ను, 18వ వార్డులో ఉద్యానవనం, దుంపలపల్లి 4వ వార్డులో ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశారు.
నిర్వహణ శూన్యం
లక్షల రూపాయల నిధులతో పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్కుల్లో ఆహ్లాదం లేకుండా పోయింది. పార్కు చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో కట్టపై ఓపెన్ జిమ్ వద్ద ప్లాట్ఫామ్ ధ్వంసమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలుమండిపడుతున్నారు.
విరిగిన ఆట వస్తువులు
పట్టణ సుందరీకరణలో భాగంగా రామసముద్రం చెరువు కట్టపై 2019లో రూ.50 లక్షల ఎస్ఓఎఫ్ నిధులతో నిర్మించిన పిల్లల పార్కు విరిగిన ఆట వస్తువులతో దర్శనమిస్తోంది. గుర్రపు బొమ్మలు, జారుడు బల్లలు, ఉయ్యాలలు విరిగిపోయాయి. కొన్నింటిని మందుబాబులు చెరువులో పడేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మందుబాబులకు అడ్డాగా
మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డులో 2022లో రూ.4 లక్షలు వెచ్చించి ఫ్రీడమ్ పార్కు నిర్మించారు. అందులో వివిధ రకాల మొక్కలు నాటి, జాతీయజెండా రంగులో టైర్లతో కుర్చీలు, ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలకు నీరందడం లేదు. దీంతో అవి ఎండిపోవడంతో పశువులకు మేతగా మారాయి. పార్కు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ విరిగిపోయి, సిమెంటు దిమ్మెలు ధ్వంసమయ్యాయి. పార్కులో ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు దర్శనమిస్తున్నాయి.
రామసముద్రం కట్టపై పిల్లల పార్కు

నిర్వహణ లేక కరువైన ఆహ్లాదం

నిర్వహణ లేక కరువైన ఆహ్లాదం