పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్తంగి డివిజన్ పరిధిలో గురువారం రాత్రి సుమారు 26 ఏళ్ల యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో పటాన్చెరు నుంచి వస్తున్న ఒక వాహనం వెనుక నుంచి అతడిని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడికి తలకు తీవ్ర రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ పరిసర ప్రాంతాల్లో విచారించినప్పటికీ మృతుడి ఆచూకీ లభించలేదు. మృతుడికి సంబంధించిన ఆనవాళ్లు లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


