తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో ఇటీవల షట్టర్ లిఫ్ట్ చేసి రెండు షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడు హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన కందుల సత్యనారాయణగా గుర్తించారు. తూప్రాన్ ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం.. ఇటీవల తూప్రాన్ పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫర్టిలైజర్, చెప్పుల దుకాణాల షట్టర్లను పైకి ఎత్తి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఇతను ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నల్గొండ టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో అతడిని అరెస్టు చేసి జైలులో ఉంచిన్నట్లు తూప్రాన్ పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా, తూప్రాన్ పట్టణంలోని రెండు దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడని ఎస్ఐ తెలిపారు. న్యాయస్థానం అనుమతితో నిందితుడిని శుక్రవారం నల్గొండ జైలు నుంచి మెదక్ కోర్టులో హాజరు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జైలుకు తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు.
నిందితుడి అరెస్టు


