పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సీపీఎస్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, ఓపీఎస్ను అమలు చేయాలని, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ‘‘నేస్తమా కదలిరా.. సీపీఎస్ రద్దుకై ’’ అనే చైతన్య గీతంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం సాంస్కృతిక రూపంలో సాగుతున్న ఈ ప్రచారం ఉద్యమానికి కొత్త ఊపునిస్తుందన్నారు. రెండున్నర లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభావితమవుతున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. సీపీఎస్ రద్దు అంశం మేనిఫెస్టోలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగుల్లో నిరాశ కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


