2,597 మంది అభ్యర్థులు హాజరు ● నిమిషం ఆలస్యంతో విద్యార్థినికి నో ఎంట్రీ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష రాసేందుకు సమయం 180 నిమిషాలు మాత్రమే ఉంటుండగా ప్రస్తుతం పరీక్ష రాసేందుకు 195 నిమిషాల సమయాన్ని కేటాయించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 నిమిషాల వరకు జరిగింది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందు నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 2,924 మంది అభ్యర్థులకు గాను 2,597 మంది హాజరు కాగా 327 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. తారా కళాశాలలో ఒక విద్యార్థి నిమిషం ఆలస్యం రావడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, డీఎస్పీ సత్తయ్యగౌడ్ సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.
డల్లాస్ నుంచి వచ్చి..
హిమనీష్ వెలువలి అనే విద్యార్థి కుటుంబం అమెరికాలోని డల్లాస్లో స్థిర పడింది. నీట్ రాసేందుకు సంగారెడ్డికి వచ్చాడు. హిమనీష్ బీరంగూడలోని అతడి పెదనాన్న ఇంటికి చేరుకుని అక్కడి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. గత నెలలో జరిగిన పరీక్ష కు సైతం హాజరయ్యాడు. ఒకసారి వస్తే సుమారు రూ.2 లక్షల ఖర్చు అయ్యిందని, రెండు సార్లు పరీక్ష రాసేందుకు రావడంతో రూ.4 లక్షల ఖర్చు అయ్యిందని వాపోయాడు.


