● పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష ● నిరుద్యోగుల్లో కదలిక ● ఏ కేటగిరీ వారీగా ఇస్తారోనన్న సందేహాలు
నారాయణఖేడ్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎంతో ఆర్భాటంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించడం..యువతలో ఆశలు మొగ్గలు తొడగడం..తర్వాతి కాలంలో పథకం మూలన పడిపోయింది. ఏళ్లుగా పథకం గూర్చి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురవుతూ వస్తోంది. కాగా, తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు గౌరవ్, సిక్తా పట్నాయక్ తదితరులతో సమీక్ష నిర్వహిస్తూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నామని వెల్లడించారు. దీని అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం గూర్చి చర్యలు ప్రారంభం కావడంతో స్వయం ఉపాధి పొందాలన్న ఆశతో ఉన్న యువతలో ఆశలు చిగురిస్తున్నాయి.
పథకానికి జిల్లాలో ఊహించని విధంగా భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 2025 మార్చి 17న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. భారీగా నిరుద్యోగులు స్పందించి 51,657మంది దరఖాస్తులను సమర్పించారు. అత్యధికంగా బీసీ వర్గాల నుంచి 6,546 యూనిట్లకుగాను 23,681 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో 7,415 యూనిట్లకు 14,480 దరఖాస్తులు, మైనార్టీ విభాగంలో 2,456 యూనిట్లకు 8,378 దరఖాస్తులు, ఎస్టీ విభాగంలో 2,502 యూనిట్లకు 4,232 దరఖాస్తులు, ఈబీసీలో 1,654 యూనిట్లకు 817 దరఖాస్తులను సమర్పించారు. రూ.50వేల లోపు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ 1లో చేర్చారు. రూ.50వేల నుంచి రూ.1లక్ష మధ్య ఉన్న దరఖాస్తులదారులను కేటగిరీ 2లో, రూ.1లక్ష నుంచి రూ.2లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 3గా, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 4లో చేర్చారు.


