● రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్ ● అక్కడికక్కడే గృహిణి దుర్మరణం
వర్గల్(గజ్వేల్): బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవ్రహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం... గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్గౌడ్, శ శాంక్గౌడ్ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది. మామిడ్యాల కమాన్ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్ బైక్పై హైదరాబాద్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు.
బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని తొనిగండ్ల గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... దంతేపల్లికి చెందిన దేవరాజు, రాజయ్య స్వగ్రామం నుంచి బైక్పై రామాయంపేట వస్తుండగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఎస్ఐ బాల్రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


