● డ్రైవర్కు త్రీవ గాయాలు ● మూడు గంటలు స్తంభించిన రాకపోకలు
శివ్వంపేట(నర్సాపూర్): తూప్రాన్– నర్సాపూర్ హైవేపై శుక్రవారం అర్ధరాత్రి రెండు కంటైనర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. చండీ గ్రామ శివారులో మహరాష్ట్రకుకు చెందిన రెండు లారీలు ఢీకొనడంతో ఓ లారీలోని డ్రెవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు, ఇతర లారీ డ్రెవర్లు అతికష్టంపై బయటకు తీశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన డ్రెవర్ వీరేందర్కుమార్ని అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఢీకొన్న కంటైనర్ లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఇరువైపులా మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు లారీలను పక్కకు తీసి రాకపోకలను పునరుద్ధరించారు.
లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి
కొండాపూర్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ సిద్ది ప్రాంతానికి చెందిన ప్రకాశ్ సాకేత కొన్ని నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి వలసవచ్చాడు. డ్రైవర్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం వృత్తిలో భాగంగా కంకర లోడ్ను అన్లోడ్ చేసేందుకు మైతాబ్ఖాన్ గూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్ శివారులో రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ ప్రకాశ్ సాకేత అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మామ దాదులాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం... బొలెరో వాహనం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో రాంపూర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ నయ్యుం పఠాన్కు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న అంజాద్ షేక్కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని అంబులెన్సులో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. లారీ డ్రైవర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


