● ములుగు విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి ● వర్సిటీలో రైతులతో చర్చా కార్యక్రమం
ములుగు(గజ్వేల్): రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యాన పంటల సాగును ఐదు లక్షల ఎకరాలకు విస్తరించాల్సిన అవసరముందని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. వర్సిటీలో శనివారం రైతులతో నిర్వహించిన పరస్పర చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వల్ప కాలంలోనే ప్రతి గ్రామం ఉద్యానవన నమూనా గ్రామాలుగా అభివృద్ధి చెందేలా రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యానశాఖల సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపు, నాణ్యమైన దిగుబడులు సాధించడం, ఆధునిక సాగు సాంకేతికతల ఆవలంబనలో రైతులకు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో తలెత్తే పురుగు, తెగుళ్ల నివారణ, నేల ఆరోగ్య నిర్వహణ, పోషక పదార్థాల సమతుల్య వినియోగం, సమగ్ర పంట నిర్వహణ తదితర అంశాలపై రైతులకు తగు సూచనలు అందజేశారు. రైతులు లేవనెత్తిన సమస్యలకు శాస్త్రవేత్తలు తగిన సాంకేతిక పరిష్కారాలను సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, బోధన సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


