డీసీపీ చింతమనేని శ్రీనివాస్
పటాన్చెరు టౌన్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహీధర లగ్జూరియా విల్లాస్ యాజమాన్యం మహీధర విల్లాస్ –3 జోన్స్లో 50 సీసీ కెమెరాలను స్వర్ణాక్షి డెవలపర్స్ అధినేత విజయ సాగర్, సాయి సహకారంతో ఏర్పాటు చేయగా వాటిని డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాలు జరిగిన సందర్భాల్లో నిందితులను వేగంగా గుర్తించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొనే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరమని, ఇంటికి తాళం కంటే సీసీ కెమెరా విలువ ఎక్కువ అని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయక రెడ్డి, ఎస్ఐ ఆసిఫ్ అలీ, స్థానిక నాయకులు స్వాతి రెడ్డి, రమ్య, నవీన్, మురళీధర్ పాల్గొన్నారు.


