సంగారెడ్డి జోన్: ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం రుణాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ...జిల్లాలో పంట రుణాల లక్ష్యం రూ.3,499.21 కోట్లకు గాను 90.66%, మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.6,816.57 కోట్లకు గాను 87.16%, అడ్వాన్సుల లక్ష్యం రూ.23,438.93 కోట్లకుగాను 92.81% సాధించినట్లు వివరించారు. వివిధ రంగాలు, పరిశ్రమల అభివృద్ధికి అవసరం మేరకు రుణాలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్, ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మేనేజర్ తుల్జానాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల బోధనలతోనే భవిష్యత్తు
జోగిపేట(అందోల్): ఉపాధ్యాయుల విద్యాబోధనతోనే సమాజంలో విద్యార్థులు భావి పౌరులుగా ఎదుగుతారని అదనపు కలెక్టర్ ఆర్.పాండు పేర్కొన్నారు. అందోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.చెన్నయ్య పదవీవిరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, ఉద్యోగ జీవితంలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయన్నారు. మండలంలో ఉపాధ్యాయుడు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. తాను ఆర్డీఓగా పనిచేసిన సమయంలో వారి సేవలను దగ్గరుండి పరిశీలించినట్లు తెలిపారు. జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు ఎ.మాణయ్య మాట్లాడుతూ..ఉపాధ్యాయుడిగా చెన్నయ్య అందించిన సేవలు మరువలేనివని, తమ పిల్లలను కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. అనంతరం పీఆర్టీయూ ఆధ్వర్యంలో చెన్నయ్యను సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎ.చిట్టిబాబు, జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రభు, ఎంఈఓ కృష్ణ, పీఆర్టీయూ అర్బన్ అధ్యక్షుడు నరోత్తం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.అనిల్కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ ప్రసాద్, హెచ్ఎం నరేశ్కుమార్లతోపాటు పలువురు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పాండు


