మద్దూరు(హుస్నాబాద్): బాలికను వేధించిన కేసులో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మద్దూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహ్మద్ ఆసీఫ్ కథనం ప్రకారం... ఈనెల 16న బాలికతో చిలుక రాజశేఖర్ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడమే గాక, వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై ఫోక్సో కేసు నమోదైంది. ఈ మేరకు అతడ్ని కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
పోలీసులకు ఫిర్యాదు
కొమురవెల్లి(సిద్దిపేట): వ్యక్తిపై పలువురు ఆకతాయిలు దాడి చేశారు. ఏఎస్ఐ సత్యనారాయణ రెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం సొంత పనిపై కుటుంబంతో కలిసి తన కారులో చేర్యాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురుజకుంట వాగు సమీపంలో అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన యువకులు సురేశ్, రాంబాబు, కర్ణాకర్ వాహనాన్ని అజాగ్రత్తగా , వేగంగా వాహనం నడుపడంతో శ్రీనివాస్ తన వాహనాన్ని సడన్గా నిలిపాడు. దీంతో వాహనం నుంచి దిగి యువకులను అతివేగంగా వాహనం నడపవద్దు అని మందలించాడు. దీంతో ఆ యువకులు కోపంతో అతనిపై దాడి చేశారు. వెంటనే బాధితుడు కొమురవెల్లి పోలీస్స్టేసన్ ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేశారు.
రామాయంపేట(మెదక్): గంజాయి తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ నరేందర్ కథనం ప్రకారం... మెదక్ పట్టణానికి చెందిన చింతకుంట ప్రేంకుమార్, కెంద్రె నిఖిల్ బుధవారం స్కూటీపై 140 గ్రాముల ఎండు గంజాయితో వస్తుండగా, అక్కన్నపేటవద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ నరేందర్తోపాటు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ గోపాల్, ఎస్ఐలు హరీశ్, బాలయ్య, షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్జోన్: కళాకారుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడిగా గూడాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని కళాభారతిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీల నియామక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా అధ్యక్షుడిగా తనను ఎంపిక చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం 14 ఏళ్లపాటు అలుపెరగని పోరాటంలో కళాకారుల పాత్ర సింహాభాగం అన్నారు. గత ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కళాకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.


