● వర్గల్ కమాన్ వద్ద మృతురాలి కుటుంబీకుల రాస్తారోకో
● న్యాయం చేయాలని పట్టు
వర్గల్(గజ్వేల్): పరిహారం ఇప్పించి తమకు న్యాయం చేయాలని రోడ్డు ప్రమాద మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు బుధవారం వర్గల్ కమాన్ సమీప రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం వర్గల్ కమాన్ వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వేములఘాట్కు చెందిన ఆటోడ్రైవర్ భార్య కొరివి లక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కుటుంబీకులు, గ్రామస్తులు వర్గల్ కమాన్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దాదాపు అరగంట పాటు రాస్తారోకోతో రాజీవ్ రహదారి ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా, గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, గౌరారం ఎస్ఐ ఆరోగ్యం వారికి నచ్చజెప్పినా వినలేదు. దీంతో వారిని చెదరగొట్టి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం న్యాయం జరిగేలా చూస్తామని పోలీసుల హామీతో వారందరూ వెళ్లిపోయారు.
11 మందిపై కేసు..
కారు డ్రైవరు నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని, రాజీవ్ రహదారిపై అడ్డుగా కూర్చొని రాకపోకలు నిలిపేసిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు గౌరారం ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు.


