శుచి, శుభ్రత పాటించాల్సిందే
ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్
ఝరాసంగం(జహీరాబాద్): జాతరలో భాగంగా కొనుగోలుదారులకు అమ్మే తినుబండారాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్ దుకాణదారులకు సూచించారు. శనివారం ఝరాసంగంలోని ఆలయంలో లడ్డూ తయారీతోపాటు పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుకాణాల పరిసరాలలో తప్పనిసరిగా శుచి, శుభ్రతను పాటించాల్సిందేనన్నారు. కల్తీ పదార్థాలు వాడకూడదని, తిను బండారాలపై తప్పనిసరిగా కవర్లు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతోపాటు సిబ్బంది రవి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విప్
కాపీ అందజేత
జిన్నారం (పటాన్చెరు): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీమంత్రి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తరఫున నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి మున్సిపల్ కమిషనర్ తిరుపతిని శనివారం ఆయన కార్యాలయంలో కలిసి విప్ అందజేశారు. సోమవారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో విప్ జారీ చేయడం విశేషం.
గులాబీ గూటికి
ఇద్దరు స్వతంత్రులు
పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
పటాన్చెరు: ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఇద్దరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్రెడ్డి, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ సార లావణ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఎమ్మెల్యే తెలిపారు.
జిన్నారంలో కూడా...
జిన్నారం మున్సిపల్ ఎన్నికల్లో 9 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీలత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు కూడా పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.
పేట మున్సిపాలిటీలో
మహిళల హవా
మొత్తం 26వార్డుల్లో 17 మంది మహిళలే
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపాలిటీలో 26 వార్డులుండగా 17 స్థానాల్లో మహిళలు గెలుపొందారు. చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేయగా మహిళలు రిజర్వేషన్తోపాటు జనరల్స్థానాల్లోను పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 3వ వార్డు రేణుక, 5వ వార్డు ఫాతిమా, 7వ వార్డు పాతదొడ్డి అనిత,11వ వార్డు గౌరీప్రియాంక, 12వ వార్డు పులిమామిడి మమత, 15వ వార్డు గౌసియాబేగం, 16వ వార్డు కొత్తగొల్ల లావణ్య ,18వ వార్డు బిట్ల నిఖిత, 19వ వార్డు రోజా పట్లూరి 20వ వార్డు మునిపల్లి అంజమ్మ, 23వ వార్డు లక్ష్మిప్రియా గెలుపొందగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి 6వ వార్డు నాగులమాణెమ్మ, 13వ వార్డు ఎర్ర విశాలి, 24వ వార్డు శభణమ్, 26వ వార్డు అపర్ణపాటిల్, బీజేపీ నుంచి 14వ వార్డు ఉల్లిగడ్డ ఉమారాణి, 22వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గారెల గౌరీదేవిలు ఎన్నికయ్యారు.
శుచి, శుభ్రత పాటించాల్సిందే
శుచి, శుభ్రత పాటించాల్సిందే


