భర్త మృతి తట్టుకోలేక..
భార్య ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: చెరువులో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నర్సాపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి (58) భర్త శివరాములు నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనస్తాపానికి గురై బాధపడుతుంది. శుక్రవారం నర్సాపూర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రాయరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికారు. రాయరావు చెరువు వద్ద లక్ష్మి చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో శనివారం తిరిగి గాలింపు చేపట్టగా లక్ష్మి మృతదేహం చెరువులో లభించింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధ తాళలేక మెకానిక్...
సిద్దిపేటఅర్బన్: అప్పుల బాధ తాళలేక మెకానిక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఇర్రి సంతోష్రెడ్డి (33) రంగధాంపల్లిలో కొంత కాలంగా కారు మెకానిక్ షెడ్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తల్లిదండ్రులు మాధవరెడ్డి, అరుణ, భార్య తేజశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎప్పటిలాగే మెకానిక్ షెడ్డుకు పనికి వచ్చిన సంతోష్రెడ్డికి రాత్రి 10 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు ఫోన్ చేయగా ఇంటికి వస్తున్నానని చెప్పాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో షెడ్డుకి వచ్చి చూడగా అక్కడే ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు.


