
అడ్మిషన్ ఇవ్వండి మహాప్రభో..
సర్కారు బడుల ఎదుట విద్యార్థుల క్యూ
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించి చిన్నారులను పాఠశాలలో చేర్పించుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా తయారైంది. మాకు అడ్మిషన్లు కావాలి మహాప్రభో అని నిత్యం వందలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా నో అడ్మిషన్ అని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మరి కొందరు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు.
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గత ప్రభుత్వం నిరుపేదల కోసం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. ఫేస్– 1 డిగ్నిటీ కాలనీలో 2052, ఫేస్ –2 కేసీఆర్ నగర్లో 15,660 ఇళ్లను నిర్మించి పేదలకు కేటాయించారు. ఈ ఇళ్లలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో లబ్ధిదారులు వచ్చారు. ఈ నివాసాల్లో సుమారు 3వేల మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఉన్నత పాఠశాల లేక ఇబ్బందులు
కేసీఆర్ నగర్లో అధికారులు తాత్కాలికంగా గదులు కేటాయించి ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం అంగాన్వాడీ కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూం సముదాయం నిర్మించేటప్పుడు పక్కనే ఒక ఎకరం స్థలం పాఠశాల కోసం కేటాయించారు. కానీ అందులో ఎలాంటి నిర్మాణం చేయలేదు. ఉన్నత పాఠశాల లేకపోవడంతో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు.
నో అడ్మిషన్స్..
డబుల్ ఇళ్ల సముదాయానికి కొల్లూరు జెడ్పీ పాఠశాల దగ్గరలో ఉంటుంది. అక్కడ విద్యార్థులకు సరిపడ సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్లు ఇవ్వడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం వచ్చిన విద్యార్థులకు అడిష్మన్లు ఇస్తున్నామని తెలిపారు. చాలా మంది విద్యార్థులు తెల్లాపూర్ జెడ్పీ పాఠశాలలో అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. అక్కడ ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ సుమారు 150 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి చేసేదీ ఏమి లేక చేతులెత్తేశారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ సమస్యను పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.
ముందు చూపు లేని అధికారులు
కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్లలో విద్యార్థులు ఉంటారని తెలిసి కూడా అధికారులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమీప గ్రామాల్లోని పాఠశాలల్లో చేర్పించే విధంగా కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొల్లూరు డబుల్ బెడ్రూం సముదాయంలో 3వేల మంది
పిల్లల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రుల ఆందోళన
పట్టించుకోని అధికారులు