
అదనపు కట్నం కోసం వేధింపులు
అక్కన్నపేట(హుస్నాబాద్): అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అక్కన్నపేట మండలం మల్చెర్వుతండా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్భాస్కర్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన భూక్య వసరాంతో కోహెడ మండలం, బస్వాపూర్ గ్రామ పరిధిలోని ఆరెపల్లితండాకు చెందిన ధరావత్ రాజు కుమార్తె భూక్య శ్రావణి(25)తో ఐదేళ్ల క్రితం రూ.5లక్షల కట్నకానుకలతో ఘనంగా వివాహం చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దినెలలు సజావుగా ఉన్న వీరి సంసారంలో అదనపు కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులకు గురిచేసేవారు. ఈ విషయం శ్రావణి తన తల్లిదండ్రులకు చెప్పగా పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మరో రూ.లక్ష అదనంగా ఇచ్చారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో తండావాసులు, కుటుంబీకులు హుటాహుటిన అంబులెన్స్లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ధరావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య