
రేషన్ కష్టాలు
రామాయంపేట(మెదక్): మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో నిరుపేదలు ఇబ్బందులపాలవుతున్నారు. రేషన్ దుకాణాలకు సక్రమంగా బియ్యం స్టాక్ సరఫరా కాకపోవడంతో వినియోగదారులు గంటల తరబడి దుకాణాలవద్ద పడిగాపులు కాస్తున్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది రేషన్ దుకాణాలకుగాను ఒక దుకాణానికి తప్పించి మిగతా దుకాణాలకు రెండో విడత బియ్యం సరఫరా కాలేదు. రెండు, మూడు కోటాలకు సంబంధించి బియ్యం స్టాక్ ఒకే దుకాణానికి ఇవ్వడంతో సదరు దుకాణానికి మంగళవారం వినియోగదారులు పోటెత్తారు. క్యూలో నిల్చునే ఓపిక లేకపోవడంతో చాలామంది బియ్యం కోసం తెచ్చిన సంచులను క్యూలో ఉంచారు. తమకు బియ్యం స్టాక్ రాకపోవడంతో డీలర్లు స్థానికంగా ఉన్న సివిల్ సప్లై గోదాం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఒకే రేషన్ దుకాణానికి స్టాక్ ఎలా పంపుతారని అక్కడి అధికారులను నిలదీశారు. మిగతా దుకాణాలకు వెంటనే స్టాక్ పంపిస్తామని వారు పేర్కొన్నారు.
పది సంచుల బియ్యం మాయం
సవిల్ సప్లై గోదాంనుంచి పది సంచుల బియ్యం అపహరణకు గురయ్యాయి. లెక్కల్లో తేడా రావడంతో ఖంగుతిన్న అధికారులు రికార్డులు పరిశీలించగా ఈవిషయం బయటపడింది. స్థానికంగా ఒక డీలర్కు పది సంచులు ఎక్కువ వేసినట్లు తేలింది. ఈ విషయమై ఆర్ఐ గౌస్ గోదాంకు వచ్చి విచారణ జరిపారు. పది సంచులు తక్కువ ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ బియ్యం వేసిన డీలర్ వద్ద నుంచి ఆసంచులు రికవరీ చేయాలని సూచించారు.
స్టాక్ రాకపోవడంతో
దుకాణాల వద్ద జనం పడిగాపులు

రేషన్ కష్టాలు