
కోతుల దాడిలో చిన్నారికి గాయాలు
నారాయణఖేడ్: రోజు రోజుకు ఖేడ్ పట్టణంలో కోతుల బెడద అధికం కావడంతో పట్టణ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సత్యసాయి కాలనీ సమీపంలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి కూతురు అమూల్య (4) చిన్నారి ఆడుకుంటుండగా మంగళవారం కోతులు దాడి చేశాయి. ఎడమ చేయికి కరవడంతో తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరుబయట కూర్చోవాలన్నా, చిన్నపిల్లలు ఆడుకుంటున్నా, మహిళలు ఒకరిద్దరు ఉన్నా దాడులకు తెగబడుతున్నాయని కాలనీ వాసులు వాపోయారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా
ప్రాణాలతో బయటపడిన వ్యక్తి
శివ్వంపేట(నర్సాపూర్) : ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడిన ఘటనలో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మియ్యడి శ్రీనివాస్ తన సొంత ట్రాక్టర్తో పొలం దున్నకం చేపట్టి ఇంటికి వస్తుండగా బురదబాట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. శ్రీనివాస్ స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని ఉండటంతో బోల్తా పడినప్పటికీ అందులో ఇరుక్కుపోయాడు. గుర్తించిన స్థానిక రైతులు జేసీబీతో ట్రాక్టర్ ఇంజిన్ను పైకి లేపి శ్రీనివాస్ని బయటకు తీశారు. స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనారోగ్యంతో
వ్యక్తి ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లకాటి శ్రీనివాస్(51) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య సరిత, కూతురు, కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేలాడుతున్న విద్యుత్ తీగలు
పట్టించుకోని అధికారులు
మనోహరాబాద్(తూప్రాన్): రైతుల పంట పొలాల మీదుగా ఉన్న విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ యమపాశాలుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కాళ్లకల్ గ్రామ శివారులోని గార్లకుంట పరిసర పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలు చేతికి తగిలేలా వేలాడుతున్నాయని తెలిపారు. వాటిని సరిచేయాలని, విద్యుత్ అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మోడల్ విద్యార్థికి రాష్ట్రస్థాయి ర్యాంకు
ఝరాసంగం(జహీరాబాద్): తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థి పురం అక్షిత రెడ్డి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాల్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం కళాశాలలో విద్యార్థికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేనా వతి అభినందించి, సన్మానించారు.

కోతుల దాడిలో చిన్నారికి గాయాలు

కోతుల దాడిలో చిన్నారికి గాయాలు

కోతుల దాడిలో చిన్నారికి గాయాలు