
డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం
హుస్నాబాద్: డ్రగ్స్ను తరిమికొడుదాం.. చక్కగా చదువుకుందాం..జ్ఞానాన్ని పెంచుకుందామనే నినాదంతో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రకు నడుం బిగించింది. పల్లెల్లో విస్తరిస్తున్న డ్రగ్స్ను తరిమిమేయాలనే సంకల్పంతో గ్రామ గ్రామాన ర్యాలీలు, అవగాహన సదస్సులతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గూర్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏప్రిల్ 21న నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మాణిక్యాపూర్ నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామడి మండలాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు.
యువతను చైతన్య పరుస్తూ..
ఈ పోరు యాత్రలో ప్రజా, మహిళ, విద్యార్థి సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు, విద్యావంతులు, సామాజిక వేత్తలను భాగస్వాములను చేస్తూ యువతను చైతన్యపరుస్తున్నారు. నగరాలు, పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ మహమ్మారి పల్లెలకు పాకింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, నిఘా వ్యవస్థలు సైతం డ్రగ్స్ను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతే టార్గెట్గా మత్తు పదార్థాలు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో యువత వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు.
అవగాహన కార్యక్రమాలు
గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సహకారంతో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. యువతను కాపాడుకోవాలని, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? కనిపెట్టాలని తల్లిదండ్రులకు వక్తలు సూచిస్తున్నారు. మెదడుపై ప్రభావితం చూపే డ్రగ్స్ వినియోగం వల్ల విచక్షణ రహితంగా హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడతారని తెలియజేస్తున్నారు. డ్రగ్స్కు, బెట్టింగ్లకు యువతను దూరంగా ఉంచి చదువుకు దగ్గర చేయాలని కోరుతున్నారు.
నిర్మూలనే లక్ష్యంగా
జేఏసీ ఆధ్వర్యంలో పోరు యాత్ర
పల్లెలకు విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలు
పేద కుటుంబాలు విచ్ఛిన్నం
నియోజకవర్గంలో
అవగాహన సమావేశాలు
వెలుగులోకి వస్తున్న ఘటనలు..
ధర్మరాజు పల్లెలో ఓ యువకుడు బెట్టింగ్లో దాదాపు రూ.5కోట్లు నష్టపోయి, అంతా అయిపోయాక కూలీ పనులు చేసుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
శనిగరంలో మొబైల్ కొనివ్వకపోతే తన కొడుకు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
ఓ గ్రామంలో ఇంటర్మీడియెట్ స్థాయికి మించి చదువుకున్న వారు లేరని, బెట్టింగ్లో పాల్గొంటూ మగవారి కంటే మహిళలే ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని జేఏసీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
మైసంపల్లి గ్రామంలో బెట్టింగ్ ఆడి త్రీవంగా నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
సమష్టిగా ఉద్యమిస్తే అరికట్టవచ్చు
గ్రామాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. డ్రగ్స్ ఎవరు వాడుతున్నారో, ఎక్కడి నుంచి వస్తోందో తెలిసిన మహిళలు చెప్పేందుకు భయపడుతున్నారు. సారా నిర్మూలనకు మహిళలు పోరాటం చేసినట్లుగా, డ్రగ్స్ నిర్మూలనకు అదే స్ధాయిలో ఉద్యమిస్తే తప్ప అరికట్టలేం. ప్రభుత్వం, పోలీసులు, మహిళలు, ప్రజలందరు సమష్టిగా ఉద్యమిస్తే డ్రగ్స్ నిర్మూలనను పూర్తిగా నిర్మూలించవచ్చు. ఈ నెలాఖరులోగా పోరు యాత్ర సభను నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తాం.
– మేకల వీరన్న యాదవ్, డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర నియోజకవర్గ కో ఆర్డినేటర్, హుస్నాబాద్

డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం

డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం