
ఏసీబీకీ చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మునిపల్లి(అందోల్): ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. బుదేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం... కోహిర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో వాటర్ సర్వీసింగ్ సెంటర్, ఓపెన్ ప్లాట్కు కొత్త ఇంటి నంబర్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి రూ.8వేల లంచం డిమాండ్ చేసింది. బాధితుడు ఆమె అడిగినంత ఇస్తానని ఒప్పందం చేసుకుని నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పంచాయతీ కార్యదర్శి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రత కారణాల వల్ల ఫిర్యాదు దారుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. నాగలక్ష్మిని అరెస్టు చేసి హైదరాబాద్లోని నాంపల్లి స్పెషల్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే పంచాయతీ కార్యదర్శిగా మునిపల్లి మండంలో 18 సంవత్సరాలుగా ఆమె విధులు నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మండల స్థాయి అధికారులు బదిలీపై ఇతర చోట్లకు వెళ్లారు. కానీ ఆ కార్యదర్శి మాత్రం మునిపల్లి మండలంలోనే విధులు నిర్వహించడం గమనార్హం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ఏసీబీ ఎస్ఐలు రమేశ్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
లంచం తీసుకుంటుండగా
పట్టుకున్న అధికారులు