
మల్లన్న ఆలయంలో వేలం పాట
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయానికి సంబంధించి ఈ టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలంను ఆలయ ఈఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మల్లన్న సమావేశ మందిరంలో తదితర వాటిపై లైసెన్సు హక్కును పొందేందుకు వేలం నిర్వహించారు. కొబ్బరి ముక్కలు సేకరించేందుకు లైసెన్సు హక్కును కురవికి చెందిన యుగేందర్ రూ.71,77,777కు, వస్త్రాలు, ఒడి బియ్యం, పసుపు సేకరించే హక్కును కొమురవెల్లికి చెందిన ఉప్పల వంశీకృష్ణ రూ.70,56,000కు దక్కించుకున్నారు. కోరమీసాలు, మొక్కుబడి వస్త్రాల విక్రయించే హక్కును ఎక్కాల దేవి అరుణ రూ.16,61,000లకు దక్కించుకోగా, టాయిలెట్స్ నిర్వహణ హక్కును మిశ్రా ఎంటర్ప్రైజెస్ రూ.4,71,000లకు దక్కించుకున్నారు. ఆలయానికి పాలు పెరుగు సరఫరా చేసే హక్కును కడెం సిద్దులు, ఆలయంలో వీడియో, ఫొటోలు తీసే లైసెన్సు హక్కును మల్లం నవీన్ దక్కించుకున్నారు. అలాగే ఆలయంలో కొబ్బరి కాయల విక్రయం, ఎల్లమ్మ ఆలయం వద్ద కూల్డ్రింక్స్, పూల సరఫరా, బుక్స్ ప్రింటింగ్ కోసం నిర్వహించిన వేలంలో సరైన ధర రాకపోవడంతో వాటిని వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈఓ పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లిలో దళితుడు సత్యనారాయణ వ్యవసాయ భూమిలో అక్రమంగా నిర్మించిన సెల్ టవర్ను తొలగించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేసినట్లు దళిత బహుజన ప్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో దళితుడి భూమి ఆక్రమణతో పాటు సెల్టవర్ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధిత కటుంబీకులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. చైర్మన్ను కలిసిన వారిలో దళిత సంఘాల నాయకులు అశోక్, స్వామి, సంజీవ్ తదితరులు ఉన్నారు.
మహిళ అదృశ్యం
నర్సాపూర్ రూరల్: మహిళ అదృశ్యమైన ఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన ఖాజిపల్లి నర్సిహులు భార్య పద్మ (37) గత నెల 20న తన తల్లిగారి ఊరు రుస్తుంపేటకు వెళ్లొస్తానని చెప్పి బయలు దేరింది. తిరిగి ఇంటికి రాలేదు. బంధువులతోపాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో భర్త ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో
పాడి గేదె మృతి
శివ్వంపేట(నర్సాపూర్): విద్యుదాఘాతంతో పాడి గేదె మృత్యువాత పడింది.ఈ ఘటన మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శంకర్గౌడ్ పాడి గేదెలతో ఉపాధి పొందుతున్నాడు. రోజువారీగానే గేదెలను మేత కోసం వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం సపోర్టు వైరుకు పాడి గేదె తగలడంతో షాక్ కొట్టింది. దీంతో పాడి గేదే మృతి చెందింది. రూ. 60 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
పెద్దశంకరంపేట మండలంలో నెమలి..
పెద్దశంకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో నెమలి మృతిచెందింది. ఈ ఘటన మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిన నెమలి ప్రమాదవశాత్తు ఎగురుతూ విద్యుత్ వైర్లకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి నెమలిని తీసుకెళ్లారు.
13 మందికి జరిమానా
పటాన్చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. పటాన్ చెరు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ వివరాల ప్రకారం... ఆదివారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 13 మందిని పట్టుకున్నారు. సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 10 మందికి రూ.వెయ్యి, ముగ్గురికి రూ.1500 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

మల్లన్న ఆలయంలో వేలం పాట

మల్లన్న ఆలయంలో వేలం పాట