అదను దాటుతోంది | - | Sakshi
Sakshi News home page

అదను దాటుతోంది

Jun 17 2025 7:01 AM | Updated on Jun 17 2025 7:01 AM

అదను

అదను దాటుతోంది

ఆశించిన స్థాయిలో కురవని వర్షం

గడువు దాటి విత్తితే దిగుబడిపై ప్రభావం

వానలొస్తే జూలై 15 వరకు విత్తవచ్చు

ఆగస్టు 15వరకు

వరి నాట్లు పూర్తి చేయాలి

వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు

దుబ్బాకటౌన్‌: రైతులు ఆశించిన దిగుబడులు సాధించాలంటే సాగులో విత్తనాలు విత్తే సమయం అత్యంత కీలకమని ఏరువాక వ్యవసాయ పరిశోధన సంస్థ తోర్నాల శాస్త్రవేత్త పల్లవి సూచిస్తున్నారు. వానాకాలం సీజన్‌ ఆరంభంలోనే వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. మరికొందరు వరి నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. సాగులో అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, చేపట్టాల్సిన విధి విధానాలను ఆమె వివరించారు. పత్తి, వరి, పప్పుధాన్యాలు, కంది, మొక్కజొన్న పంటలపై రైతులకు పలు సూచనలు చేశారు. పత్తి యాంత్రిక సాగుపై సైతం వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ కేంద్రం అధికారుల అంచనా ప్రకారం ఈ సారి సాధారణ వర్ష పాతమే నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ పరిస్థితులకనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి. భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు.

వరి: సాగు చేసే రైతులు దీర్ఘకాల రకాలను ఈ నెల 25 వరకు వరి నారు పోసుకోవాలి. మధ్య కాలిక రకాలు అయితే జూలై 10 వరకు నారు పోసుకోవచ్చు. జూలై 31వరకు స్వల్ప కాలిక రకాల నార్లు పోసేందుకు సమయం ఉంది. ఆగస్టు 15 వరకు అన్ని రకాల వరి నాట్లను పూర్తి చేయాలి. నార్లు పోసే సమయంలో విత్తనాలను తప్పకుండా శుద్ధి చేయాలి.

దొడ్డు రకాలు: కూనరం సన్నాలు, బతుకమ్మ, కాటన్‌ దొర సన్నాల రకాల పంట కాలం 120 రోజులు కాగా ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తెలంగాణ సోన , కేఎన్‌ఎం–1638 పంట కాలం 125 నుంచి 130 రోజులు కాగా, ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

దీర్ఘకాలిక సన్న రకాలు: సాంబమసూరి పంట కాలం 150 రోజులు, ఎకరాకు 28క్వింటాళ్లు, జైశ్రీరాం రకం పంట కాలం 145 నుంచి 150 రోజులు, ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

కంది: కంది, మినుము, పెసర పంటలను జూలై 15 వరకు విత్తుకోవాలి. పత్తి, మొక్కజొన్న పంటల్లో కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. డబ్ల్యూఆర్‌జీ–93 కంది రకం పంట కాలం 155 నుంచి 165 రోజులు కాగా ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు. డబ్ల్యూఆర్‌జీ–97 కంది రకం పంట కాలం 150 నుంచి 160 రోజులు కాగా ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. డబ్ల్యూఆర్‌జీ –255, టీడీఆర్జీ–59 ఈ రెండు రకాలకు 180 రోజులు పంట కాలం కాగా ఎండు తెగులు తట్టుకుని 8 నుంచి 10 క్విటాళ్ల దిగుబడి వస్తుంది.

మొక్కజొన్న: జూలై 15 వరకు మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే హైబ్రిడ్‌ రకాల్లో సాగు భూమికి అనుకూలమైనవి ఎంపిక చేసుకోవాలి. మొక్కజొన్నను ఒక పంటగా కాకుండా కందితో కలిపి అంతర పంటగా వేసుకుంటే మంచిది.

పత్తి:

అనుకున్నట్లు వర్షాలు కురిస్తే జూలై 15 వరకు పత్తి విత్తనాలను విత్తుకోవచ్చు. విత్తడంలో ఆలస్యం చేస్తే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. పంట మార్పిడి విధానం పాటించాలి. పెసర, అంతర పంటలుగా వేసుకుంటే మంచిది. ప్రభుత్వం అనుమతిచ్చిన సుమారు 20 సంస్థలకు చెందిన బీటీ–2 పత్తి విత్తనాలను మాత్రమే విత్తుకోవాలి. ఎకరానికి సాగు చేసే భూమిని బట్టి 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. పంటను డిసెంబర్‌ వరకు తీసివేయాలి. రెండవ పంటగా మొక్కజొన్న, పెసర, కూరగాయలు, పొద్దు తిరుగుడు వేసుకుంటే మేలు. పత్తి విత్తనాలను విత్తిన రెండు రోజుల తర్వాత పెండిమిఽథిలిన్‌ 38.5 శాతం 700 మి.లీ. ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయడం వల్ల కలుపును నివారించవచ్చు.

అదను దాటుతోంది1
1/2

అదను దాటుతోంది

అదను దాటుతోంది2
2/2

అదను దాటుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement